తిరుపతిలో 20 ఏళ్ల యువతిపై పాస్టర్ అత్యాచారయత్నం!

  • తిరుపతిలో కలకలం రేపుతున్న అత్యాచారయత్నం ఘటన
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని దిశ పీఎస్ పోలీసులు
  • స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ సుప్రజ
20 ఏళ్ల యువతిపై దేవసహాయం అనే పాస్టర్ లైంగిక వేధింపులకు, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన తిరుపతిలో కలకలం రేపుతోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై నాలుగు రోజుల క్రితమే దిశ పోలీస్ స్టేషన్ తో పాటు, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో... ఆమె చివరకు స్పందనలో ఫిర్యాదు చేసింది. దీంతో, ఏఎస్పీ సుప్రజ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె ఆదేశాలతో కదిలిన పోలీస్ యంత్రాంగం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

బాధితురాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి స్పందిస్తూ, బాధితురాలిపై రెండు సార్లు అత్యాచారయత్నం జరిగిందని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై హైమావతి బాధితురాలితో అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులే పట్టించుకోకపోతే బాధితులు ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన దేవసహాయంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Tirupati
Rape Attempt
Pastor

More Telugu News